భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అందులోనూ ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. వైద్యులు, నర్సులు, జర్నిస్టులు,పోలీసులు.. ఇలా అన్నివర్గాలవారూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా.. సినీ ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా.. ప్రముఖ నటుడు ఫ్రెడ్డీ దారూవాలా తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఫ్రెడ్డీ ధ్రువీకరించాడు. కుటుంబ సభ్యులందరం క్వారంటైన్లో ఉన్నామని, ఇతరులకి సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పాడు. ఇక
ఫ్రెడ్డీ తండ్రికి కరోనా సోకిందని తెలుసుకున్న ముంబై బీఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆయన ఇంటికి సీలు వేసి, శుభ్రపరిచారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్నవాళ్లందరికీ కూడా టెస్టులు నిర్వహించారు.
తన తండ్రికి గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు తదితర ఫ్లూ లక్షణాలు ఉండడంతో అతనికి ప్రత్యేక గదిని కేటాయించామని... మరుగుదొడ్డి కూడా సపరేట్గానే ఉందని... బట్టలు, వస్తువులు, అన్నీ కూడా శానిటైజ్ చేశామని ఫ్రెడ్డీ తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉందని... ధ్యానం, ప్రార్థనలు ఆయనకి సహాయపడతాయని ఫ్రెడ్డీ పేర్కొన్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.