కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితులు అనేక రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా విద్యారంగం కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఇక విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు నిరాశాజనక పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక రిపోర్ట్ బయటకు వచ్చింది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న 48 శాతం మంది భారతీయ విద్యార్థులపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ విద్యాసంస్థలకు గ్లోబల్ ర్యాంకింగ్ ఇచ్చే క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఖరీదైన విదేశీ విద్య, కోవిడ్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లడంతో విద్యార్థులు ఇతర అవకాశాలవైపు చూడాల్సి వస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
*ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్ 2020, ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ హయ్యర్ ఎడ్యురేషన్ ఛాయిసెస్* అన్న పేరుతో భారత దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు రేటింగ్ ఇచ్చే లండన్కి చెందిన క్యూఎస్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ఇటీవలికాలంలో విదేశీ విద్య కోసం సిద్ధమవుతున్న 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కొవిడ్-19 ప్రభావం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఇందులోని చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ యేతర విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలన్న తమ అభిప్రాయాన్ని పునఃపరిశీలించుకుంటున్నట్టు ఈ రిపోర్టు వెల్లడించింది. అలాగే.. దేశంలో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులపై సైతం కోవిడ్ ప్రభావం ఉండవచ్చునని ఈ రిపోర్టు వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.