ఏపీలో ఆర్టీసీ బస్సులు ఈ నెల 18 నుంచి రోడ్డు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేయడంతో అందరూ అలర్ట్ అయ్యారు. దీంతో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ నెల 18వ తేదీ నుంచి నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్, ఎక్స్ప్రెస్ తదితర హైఎండ్ సర్వీసుల్లో 50శాతం ప్రయాణికులనే అనుమతిస్తారు.
ఈమేరకు ఇప్పటికే సీట్ల అమరికను కూడా అందుకు అనుగుణంగా మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దూర ప్రాంత బస్సుల్లో టికెట్లను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే, బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బస్టాండ్లో కండక్టర్లకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చార్జీ చెల్లించి ప్రయాణికులు ఎక్కే అవకాశం కల్పిస్తారట. అలాగే.. తిరుమల శ్రీవారి భక్తుల సేవకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే నడిపించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.