ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు ధరించే పీపీఈ కిట్ల బాక్సులు పొలాల్లో దర్శనమిచ్చాయి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో రెండు బాక్సులు పడి ఉండడాన్ని స్థానిక యువకుడు గమనించి తెరిచి చూడగా..అందులో వైద్యులు ధరించే పీపీఈ కిట్లు ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అతడు కొన్నింటిని అక్కడే తగలబెట్టాడు. వాటి ద్వారా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వణికిపోయి వాటిని తగలబెట్టినట్టు అతడు చెప్పడం గమనార్హం.
అయితే..ఇదే సమయంలో మరో బాక్స్ను ఓ యువకుడు స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించాడు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ పీపీఈ కిట్లు తమవేనని జిల్లా వైద్యాధికారులు చెబుతుండగా.. స్థానిక అధికారులు మాత్రం ఈ పీపీఈ కిట్లతో తమకు సంబంధం లేదని అంటున్నారు. ఓ వైపు పీపీఈ కిట్లు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలా పొలాల్లో దర్శనమివ్వడం ఏమిటన్ననదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ కిట్లను తరలించే క్రమంలో జారిరోడ్డుపక్కన ఉన్న పొలాల్లో పడి ఉండవచ్చునని మరికొందరు అంటున్నారు.