ఓ వైపు కరోనా వైరస్ తో నానా కష్టాలు పడుతున్నారు జనాలు.. ఇదే సమయంలో విశాఖలో గ్యాస్ లీక్ తో మరో గందరగొళం ఏర్పడిన విషయం తెలిసిందే. చాలా రోజులు లాక్ డౌన్ సందర్భంగా క్లోజ్ చేసిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్న వెసులుబాటు, సడలింపు తో ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో నే విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఎన్ని కష్టాలు తీసుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంగోలు పట్టణంలోని పెర్నమిట్ట ఏరియాలోగల మినోఫార్మ్ ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.
ఇటీవల ఆ ఫార్మా కంపెనీలో శానిటైజర్లను తయారు చేశారని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాగానే శానిటైజర్లకు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా ఇప్పటికే విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ప్రజలు మరింత భయానికి గురవుతున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.