భారతీయ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ చైనాకు షాక్ ఇస్తోంది. చైనాలోని తమ కార్యకలాపాలను భారత్‌కు మార్చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల‌లో ఇక్కడ రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విధాన నిర్ణయాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హరి ఓం రాయ్‌ పీటీఐకి తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు బాగున్నాయని ఆయ‌న‌ చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై భారత్‌లోనే మొబైల్‌ ఫోన్ల అభివృద్ధి, తయారీ ఉంటుందని స్పష్టం చేశారు. *చైనాలో మా మొబైల్స్‌ డిజైన్‌ కోసం దాదాపు 600-650 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు ఈ డిజైనింగ్‌ను భారత్‌కే తరలిస్తున్నాం. మార్కెట్‌లో మా డిమాండ్‌కు తగ్గట్లుగా ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తాం* అన్నారు.

 

ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచే మా మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు సాగాయని, ఇకపై భారత్‌ నుంచి ఎగుమతులు చేస్తామని ఆయ‌న పేర్కొన్నారు. చైనాకు మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేయాలన్నదే తమ ఆశయమని చెప్పారు. ఇప్పటికే భారత్‌ నుంచి అక్కడికి మొబైల్‌ చార్జర్లు ఎగుమతి అవుతున్న విషయాన్ని ఆయ‌న గుర్తుచేశారు. ఇదే దారిలో మ‌రికొన్ని అంత‌ర్జాతీయ కంపెనీలు కూడా భార‌త్‌వైపు చూస్తున్నాయి. చైనాకు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా భారీగా పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: