కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని షాపులు మూసివేసి ఉంటున్నాయి. దీంతో ఖరాబ్ అయిన గృహోపకరణాల వస్తువులకు మరమ్మతు చేయించే పరిస్థితి కనిపించడం లేదు. ఫ్రిజ్, టీవీ, మొబైల్ ఫోన్లు లక్షలాదిగా రిపేర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సర్వీసుసెంటర్లు మూతపడటమే ఇందుకు కారణం. మార్చి 25 నుంచి ఇప్పటి దాకా దేశంలో లక్షన్నర ఫ్రిజ్లు, లక్షకుపైగా టీవీలు, కోటి వరకు మొబైల్ఫోన్లు రిపేర్లు లేక మూలనపడ్డాయట.
ఈ విషయం సెల్యూలార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్తో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగదారులు, తయారీదారుల సంఘ సంయుక్త సర్వేలో వెల్లడైంది. లక్షన్నర వరకు రిఫ్రిజిరేటర్లు, అరవై వేల వరకు ఏసీలు చెడిపోయాయి. స్మార్ట్పోన్లు, ఇతర మొబైల్ ఫోన్లు అన్నీ కలిపి సుమారుగా కోటి వరకు పాడై ఉంటాయని సర్వే అంచనా వేస్తోంది. ఇక లాక్డౌన్తో దేశంలోని చాలా ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సేల్స్ – సర్వీసు రంగం తీవ్రంగా నష్టపోయింది. చిరు మెకానిక్లకు పూటగడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు.