కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో భారతీయులకు చిక్కుకున్నారు. వీరందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందేభారత్ మిషన్లో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు. మొదటి దశ వందేభారత్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన కేంద్రం.. రెండో దశ వందేభారత్ మిషన్ చేపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆదివారం చికాగో నుంచి రానున్న తొలి విమానంలో 33మంది శంషాబాద్ విమానాశ్రయంలో దిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
అక్కడి నుంచి వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి తర్వాత ఇళ్లకు పంపిస్తారు. ఈ వార్తతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి మొన్నటివరకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఏపీవాసులను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని పెయిడ్ క్వారంటైన్లలోనే ఉంచింది. అయితే.. ఏపీ ప్రభుత్వం అభ్యర్థనమేరకు ఇప్పుడు వస్తున్న వారిని ఏపీకి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.