కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ ను ప్రకటించడంతో వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అయితే ఇదే సమయంలో వలస కార్మికుల కొరకు కొందరు తమలోని మానవత్వాన్ని వెలికితీస్తున్నారు. తాజాగా మహరాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆటో డ్రైవర్ ఔదార్యాన్ని చాటుకున్నాడు. పూణేకు చెందిన 30 ఏళ్ల అక్షయ్ అనే ఆటో డ్రైవర్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయలు దాచుకున్నాడు.
అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో అక్షయ్ వివాహం వాయిదా పడింది. దీంతో తన పెళ్లి కోసం దాచుకున్న నగదును అక్షయ్ వలస కార్మికులకు, నిస్సహాయులకు సహాయం చేయడానికి ఖర్చు చేస్తున్నాడు. ప్రతిరోజూ 400 మందికి ఆహారం అందిస్తూ అక్షయ్ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. లాక్డౌన్లో పేదల అవస్థలు చూసి, వారికి సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నానని అక్షయ్ మీడియాకు తెలిపాడు.