విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముసలమ్మ మాట్లాడుతూ.. తన సమస్యలు చెప్పింది. నువ్వు నా కొడుకులాంటివాడివేనని ముసలమ్మ భావోద్వేగానికి గురైంది. దీంతో స్పందించిన జగన్ మాట్లాడుతూ.. అమ్మా ధైర్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని ఆర్.ఆర్.ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తాము అనుమతులు ఇవ్వలేదని, ఆనాడు టీడీపీ హయాంలోనే అనుమతులు ఇచ్చారని, అయినా తాము రాజకీయం చేయలేదని, మానవత్వంతో బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏఒక్క రోజుకూడా తాను ఎవరినీ నిందించలేదని ఆయన అన్నారు.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించారని, బాధితులకు సహాయక చర్యలు చేపట్టి, వారిని కాపాడారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై.. అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని బాధితులను దవాఖానలకు తరలించారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, బాధితులకు అండగా నిలిచామని, బాధితులను ఆదుకోవడంలో అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారని, బాగా పనిచేశారని అన్నారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తున్నానని జగన్ చెప్పారు.