మంత్రి కన్నబాబుపై ముఖ్యమంత్రి జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో నిద్రించాలని అధికారులను ఆదేశిస్తే.. తాము కూడా వెళ్లి నిద్రిస్తామని మంత్రి కన్నబాబు అన్న ముందుకు వచ్చారని, తన మంత్రి వర్గంలో ఇంతమంచి మంత్రులు ఉండడం గర్వకారణంగా ఉందని జగన్ అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు బాధితులతో మాట్లాడారు. సమావేశం ముగింపులో మంత్రి కన్నబాబును జగన్ అభినందించారు. కన్నబాబు వల్లే ఈరోజు మంత్రులు బాధిత గ్రామాల్లో నిద్రించారని అన్నారు. ప్రజల్లో భరోసా కల్పించి, వారికి అండగా నిలిచారని కొనియాడారు. అంతకుముందు బాధితురాలు ముసలమ్మ మాట్లాడుతూ.. తన సమస్యలు చెప్పింది. నువ్వు నా కొడుకులాంటివాడివేనని ముసలమ్మ భావోద్వేగానికి గురైంది. దీంతో స్పందించిన జగన్ మాట్లాడుతూ.. అమ్మా ధైర్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని ఆర్.ఆర్.ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తాము అనుమతులు ఇవ్వలేదని, ఆనాడు టీడీపీ హయాంలోనే అనుమతులు ఇచ్చారని, అయినా తాము రాజకీయం చేయలేదని, మానవత్వంతో బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏఒక్క రోజుకూడా తాను ఎవరినీ నిందించలేదని ఆయన అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించారని, బాధితులకు సహాయక చర్యలు చేపట్టి, వారిని కాపాడారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై.. అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని బాధితులను దవాఖానలకు తరలించారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, బాధితులకు అండగా నిలిచామని, బాధితులను ఆదుకోవడంలో అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారని, బాగా పనిచేశారని అన్నారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తున్నానని జగన్ చెప్పారు.