విశాఖపట్నంలో మరోసారి కలకలం రేగింది. తెల్లని పొగలు ఒక్కసారిగా కమ్మేయడంతో విశాఖవాసులు ఉలిక్కిపడ్డారు. సుమారు 15నిమిషాల పాటు ఈ పొగలు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విశాఖలోని హెచ్పీసీఎల్లో రిఫైనరీలో సీడియూ-3ని తెరవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిసాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన కంపెనీ అధికారులు.. దీనిపై వివరణ ఇచ్చారు. ఉష్ణోగ్రత పెరగడం వల్లే దట్టమైన పొగలు వచ్చాయని, ఉష్ణోగ్రతను తగ్గించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని వారు పేర్కొన్నారు.
ఇటీవల విశాఖలోని ఎల్జీపాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన స్టెరిన్ వాయువును పీల్చి 12మంది మృతి చెందగా.. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురై.. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనను మరవముందే.. ఒక్కసారిగా పొగలు కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.