హైదరాబాద్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ బారిన పోలీసులు కూడా పడుతుండడంతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే కరోనాతో కానిస్టేబుల్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా.. బాలాపూర్ ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కృష్ణ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం గాంధీ దవాఖాపకు తరలించారు. కరోనా కట్టడిలో భాగంగా సుధీర్ కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో ఆయన బాధపడుతున్నాడు.
బాలాపూర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించగా వారు ఫీవర్ దవాఖానకు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అనంతరం అధికారులు వెంటనే ఆయనను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. ఉమాదేవి తెలిపారు. పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న 30 మంది సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో బాలాపూర్ వైద్య సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు.