ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ను చంపుతామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపుతోంది. యూపీ పోలీస్ ప్రధాన కార్యాలయం వాట్సాప్ నెంబర్కు అభ్యంతరకర పదజాలంతో ఈ మెసేజ్ వచ్చింది. ఓ వర్గానికి యూపీ సీఎం ముప్పుగా మారిపోయారటూ బాంబు దాడితో యోగి ఆదిత్యానాథ్ను మట్టుబెడతామని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గురువారం అర్ధరాత్రి ఈ మెసేజ్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై లక్నోలోని గోమతినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ కాల్ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.