తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీల్లో డిమాండ్ ఉన్న నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలుగా కొనసాగుతున్న వీటిల్లో రెగ్యులర్ కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), ఐవోటీ, రోబోటిక్స్, సైబర్సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయాల అనుమతి కోసం ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తు ఫారంలోనే యాజమాన్యాలు స్పష్టం చేయడం గమనార్హం.
నూతన వర్సిటీల్లో బీటెక్ వంటి కోర్సుల కోసం సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి బదులుగా జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ప్రకారం అడ్మిషన్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2020-21 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియకు జూన్ లేదా జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి సంవత్సరం నుంచి మాత్రమే వర్సిటీలుగా అవి చెలామణి అవుతాయి. బీటెక్ సెకండియర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థుల వరకు కాలేజీలుగానే కొనసాగుతాయి.