గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు తర్వలోనే శుభవార్త వినిపించనుంది. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్తో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రోరైలు సేవలు జూన్ 1 తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 22 నాటి నుంచే హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే.. లాక్డౌన్ సడలింపులతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపారాలు తిరిగి తెరుచుకున్నా.. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ సేవలు ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సగటున 4 లక్షల మందికి సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు గ్రేటర్ హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో, రైళ్లలో కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మాస్కులను ధరించడం, భౌతికదూరం, శానిటైజర్లను అందుబాటులో పెట్టడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయి. మెట్రో పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వస్తే.. వెంటనే సేవలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.