తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై పోలీసులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్లో మరో నలుగురు పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లోని కాచీగూడ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఎస్సై, వివిధ స్టేషన్లకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఎస్సై కుంటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించారు. అయితే దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. ఎస్ఐకి కరోనా పాజిటివ్ రావడంతో కాచీగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నవారందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కుల్సుంపురా పోలీస్ స్టేషన్కు చెందిన దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కరోనా వైరస్తో బుధవారం రాత్రి మరణించారు. దీంతో ఈ స్టేషన్లో పనిచేస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్ వచ్చింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం కుల్సుంపుర స్టేషన్ను సందర్శించారు. కరోనాతో మరణించిన దయాకర్ రెడ్డి చిత్రపటం వద్ద ఆయన నివాళులర్పించారు. పోలీసులు, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, అందరికీ అండగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.