ఓ వైపు లాక్ డౌన్ ఎత్తివేస్తోన్న వేళ కరోనా మన దేశంలో కోరలు చాస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్ ఎత్తి వేస్తుంటే మరో వైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో చూస్తే రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. 24 గంటల్లో ఈ స్తాయిలో కేసులు నమోదు కావడంతో పాటు ఇంత మంది మృతి చెందడం ఇదే తొలిసారి. ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది.
ఇక ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్ర, తమిళనాడులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో 47,190 కరోనా కేసులు నమోదు కాగా, 13,404 కోలుకున్నారు. 1,577 మంది మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో 15,512, గుజరాత్లో 13,664, ఢిల్లీలో 12,910 కరోనా కేసులు నమోదయ్యాయి.