ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎవరిమాటా వినరు.. తాను చేయాదల్చుకున్నది చేసి తీరుతారు.. కానీ.. ఇప్పుడు మాత్రం ఒక్క విషయంలో వెనక్కి తగ్గారు. కరోనా దవాఖానల్లోని ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ జారీ చేసిన ఆదేశాలను ఆయన వెనక్కి తీసుకున్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో చేరే పేషంట్లు ఇకపై వార్డుల్లోకి వెళ్లక ముందే మొబైల్ ఫోన్లను వార్డు ఇంఛార్జికి అప్పగించాల్సి ఉంటుందంటూ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను వాపస్ తీసుకుంది.
వార్డుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండదంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ విమర్శలు గుప్పించిన గంటల్లోనే యోగి సర్కారు మేల్కొంది. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం గమనార్హం. ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులపై వీడియోలు తీస్తారనే ఉద్దేశంతోటే మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం వార్డుల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించిందంటూ అఖిలేష్ ఆరోపించారు. ఫోన్లను బ్యాన్ చేయడం కాకుండా వార్డుల శానిటేషన్ చేయాలంటూ అఖిలేష్ హితవుపలికారు.