ఏపీలోని గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వీరారెడ్డి (40), భార్య రమణమ్మ (38), కుమార్తె పోలేరమ్మ (13)గా గుర్తించారు. దొంగతనం నెపం మోపారని అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పొలంలో మోటర్ దొంగతనం చేశాడని గత వారం రోజులుగా వీరారెడ్డి పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అదేవిధంగా పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు కు చెందిన కాకని సురేష్(22) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్ లాక్ ఉండటంతో మనస్తాపానికి గురైన సురేస్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.