ప్రపంచాన్ని ఓ పక్క కరోనా వైరస్ వణికిస్తుంటే.. భారత్ లో మరోపక్క మిడతల దండు భయాన్ని పుట్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న మిడతల దండు ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా దగ్గరగా వచ్చేసింది. మహారాష్ట్ర సరిహద్దులోని జిల్లాలకు కేవలం150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా వరకూ చేరింది. 3 కిలోమీటర్ల మేర ఉన్న కోట్లాది మిడతల గుంపు ఎప్పుడు రాష్ట్రానికి చేరుతుందోనని సరిహద్దు జిల్లాల్లోని రైతుల్లో బుగులు మొదలైంది. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న రాష్ట్రానికి ఇప్పుడు మిడతల టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ వైపు మిడతలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొవాలన్న విషయంపై కేసీఆర్ సైతం చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ మిడతల వల్ల ప్రజలకు విపరీతమైన సౌండ్ పొల్యూషన్ మాత్రమే కాదు తీవ్రమైన పంట నష్టం కూడా.
రాజస్థాన్లో దాదాపు 20 జిల్లాల్లో ఈ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. శ్రీగంగానగర్, నాగౌర్, జైపూర్, దౌసా, కరౌలీ, స్వాయి మాదోపూర్ నుంచి మిడతల దండు.. యూపీ, మధ్యప్రదేశ్ వైపు వెళ్లాయి. శ్రీగంగాపూర్లో సుమారు 4వేల హెక్టార్లలో పంట నష్టపోయింది. ఇప్పటి వరకు మిడతల దాడి వల్ల సుమారు 90 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు తెలుస్తోంది. నాగౌర్లోనూ వంద హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 67 వేల హెక్టార్లలో మిడతల నివారణ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ఓం ప్రకాశ్ తెలిపారు.