దేశంలో ఓ వైపు కరోనా ఇబ్బందులు పడుతున్నా జనాలు. మరోవైపు బీభత్సమైన ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి మనుషులు, పశు పక్ష్యాదులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇదే సమయంలో అనుకోకుండా మంటలు రాజుకుంటున్నాయి. ఇక ఓవర్ హిట్ తో ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుకోకుండా ఫైర్ అవుతున్నాయి. మరణం ఎలా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.. తాజాగా ఒడిశాలో ఘోరం జరిగింది. ఏసీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుకోకుండా జరిగి ఈ ప్రమాదంలో బీజూ జనతాదళ్(బీజేడీ) నాయకుడు, బెర్హంపూర్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అలేఖ్ చౌదరి(69), ఆయన బంధువులు భగాబన్ పాత్ర(84), సునీల్ బెహెరా(19)గా గుర్తించారు. ఈ ఘటన ఉదయం 2.15 గంటల్లో జరిగినట్లు సమాచారం. అయితే రాత్రి పూట జరిగిన ఈ ప్రమాదంలో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. చౌదరి బెడ్రూంలోని ఏసీలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో చౌదరితో పాటు భగాబన్, సునీల్ అక్కడే నిద్రిస్తున్నారు.
మంటల్లో చిక్కుకోవడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా గాయాలపాలైన వారిని అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.