ఈ నెల 19న నిర్వహించనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే.. అధికార వైసీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. అసెంబ్లీలో కేవలం 23 ఎమ్మెల్యే సీట్లే ఉన్న టీడీపీ కూడా వర్ల రామయ్యను బరిలోకి దించింది.
ఐదో అభ్యర్థి పోటీలో ఉండటంతో ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి మార్చి 25న జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకు కొత్త తేదీని ప్రకటించింది. కాగా, దేశ వ్యాప్తంగా మొత్తం 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.