అసలు ఈ కరోనాయే అనేది లేకుండా ఉంటి ఉంటే ఈ పాటికే ఏపీ రాజధాని వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసేది. ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చేయడం... అక్కడ నుంచే పాలన అంతా కొనసాగడం ప్రారంభమై ఉండేది కూడా..! అయితే కరోనా ప్రభావంతో వైజాగ్ రాజధాని వ్యవహారం తాత్కాలికంగా పక్కకు వెళ్లిపోయింది. ఈ లోగానే వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కావడంతో అసలు వైజాగ్ ఇప్పట్లో రాజధాని అవుతుందా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే వైజాగ్ వాసులకు జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందిచనున్నారు. వైజాగ్కు రాజధానిని తరలించేందుకు విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానందేంద్ర స్వామి అదిరిపోయే ముహూర్తం పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే వైజాగ్కు రాజధానిని తరలించేందుకు ముందుగా ఉగాది రోజు మార్చి 25, ఆ తర్వాత మే 28న ముహూర్తాలు అనుకున్నా కరోనా నేపథ్యంలో ఈ రెండు రోజులు రాజధాని తరలింపు సాధ్యం కాలేదు. ఇక మరో వైపు విశాఖకు రాజధానిని తరలిస్తే అక్కడ నుంచి పాలన కొనసాగించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాల ఎంపిక పూర్తయినట్టు సమాచారం.