జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో జూన్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కీలక మార్పులు చేశారు. ఈ ఏడాది జంబ్లింగ్ విధానాన్ని వర్సిటీ రద్దు చేసింది. చదివిన కాలేజీల్లోనే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్ష పేపరులోనూ మార్పులు చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకాలను జారీచేశారు. బీటెక్ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని రద్దు చేసి మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించామని తెలిపారు ప్రతి ప్రశ్నాపత్రంలో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి.
వాటిలో ఐదింటికి జవాబు రాయాలి. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించినట్టు గోవర్ధన్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఐసీఎంఆర్ సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.