డాక్టర్ సుధాకర్ తల్లి నిన్న ఏపి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు, సీబీఐ అధికారులు సుధాకర్ ను అరెస్ట్ చేయకపోయినా ఏ కారణం చేత నిర్భంధించారని సుధాకర్ తల్లి పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు హైకోర్టు అనుమతినిచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని న్యాయస్థానం సుధాకర్ కు సూచించింది.
మరోవైపు డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని విచారిస్తున్నారు. మాస్కుల కోసం ఏప్రిల్లో మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది.