కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి, నివారణపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. వైరస్ వ్యాప్తికి జీవ వైవిధ్యం దెబ్బతినడమే కారణమని పలువురు పర్యావరణవేత్తలు, నిపుణులు, ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో జూమ్ క్లౌడ్ మీటింగ్ యాప్లో ‘జీవవైవిధ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐఈఐ జాతీయ అధ్యక్షుడు నరేందర్సింగ్ హాజరై కీలక అంశాలను వెల్లడించారు
. ప్రపంచం మొత్తం కొవిడ్-19 వైరస్ గుప్పిట్లో ఉందని, దాని నుంచి బయటపడాలంటే జీవవైవిధ్యాన్ని రక్షించుకునే చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనేక ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయని, మానవ తప్పిదాల వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇక్కడ ఆయన మరికొన్ని హెచ్చరికలు కూడా చేశారు. భవిష్యత్తులో మరిన్ని దారుణాలు జరుగక ముందే తేరుకోవాలని సూచించారు.