దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా మహరాష్ట్రలో నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వం కరోనాని కట్టడి చేయానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఏమాత్రం కరోనా రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ సడలింపు తర్వాత మరిన్ని కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఔరంగాబాద్ జిల్లాలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. చికిత్స నిమిత్తం కొవిడ్ కేర్ సెంటర్కు తరలించారు.
పక్కా ప్లాన్ తో తాము ఉంటున్న గది కిటికీలు తొలగించి.. బెడ్షీట్స్ సహాయంతో కిందకు దిగి పారిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్కడ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు జైలు అధికారిని విధుల నుంచి తొలగించారు. బేగంపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ వ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 85,975 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,060 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 31,667 కేసులు నమోదు అయ్యాయి. అక్కడ 272 మంది మృతి చెందారు.