ఈ మద్య కరోనా వచ్చినప్పటి నుంచి నేరస్థులను విచారణ చేయాలంటే కొంత మంది అధికారులకు భయంగానే ఉంది.. అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మద్య ఓ దొంగను అరెస్ట్ చేసి విచారణ చేసిన పాపానికి జడ్జీతో సహా పోలీసులు క్వారంటైన్ కి తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతకు ముందు ఓ దొంగను పట్టుకున్న ట్రైనీ ఐపీఎస్ కి కరోనా సోకింది. తాజాగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్ లో భారీ దాడులకు కుట్రలు చేస్తోందన్న నేపథ్యంలో శ్రీనగర్ కు చెందిన జహాన్ జైబ్ సమీ, హీనా బషీర్ బేగ్ అనే దంపతులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. వీరికి ఆ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి.
అయితే, సమీ భార్య హీనా బషీర్ బేగ్ లో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని రావడంతో, గత 9 రోజలుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారుల్లో కలవరం మొదలైంది. దాంతో ఇప్పుడు ఎన్ఐఏ అధికాకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు, కరోనా బారినపడిన హీనాను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించనున్నారు. హీనాకు కరోనా పాజిటివ్ వచ్చినా ఆమె భర్త సమీలో ఎలాంటి అనుమానిత లక్షణాలు లేవని గుర్తించారు.