తెలంగాణ రాష్ట్రంలో పెద్దపులులు...లేదంటే చిరుతల కలకలం ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం అక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్థానికుల నుంచి అందుకున్న సమాచారంతో చిరుతను పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై ఆదివారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది. మేకను చంపి ఆహారంగా మార్చుకుంది. అలాగే మరో మేక కూడా గాయపడి మృతి చెందడం గమనార్హం.
భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, సోమవారం అధికారులు అటవీ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మేకల యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆహారం కోసం చిరుత మళ్లీ గ్రామంలోకి వచ్చే అవకాశం ఉన్నందున్న అటవీ సరిహద్దులో ప్రత్యేక బోన్ ఏర్పాటు చేశారు.చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. చిరుత కోసం షార్ప్ షూటర్స్ రంగంలోకి దిగారు. చిరుత కనిపిస్తే మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూ అధికారులు బోన్లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు స్వీయ రక్షణకు గాస్తీ కాస్తున్నారు.
చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత జాడ మరోసారి కనిపించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.ధికారులు అనుమానిత ప్రాంతాల్లో వలలు, మాంసం, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు. రాత్రిళ్లు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.చిరుత సంచారంతో స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటు వైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని భయంతో వణుకుతున్నారు. అయితే అధికారులు జాగ్రత్తగా ఉంటే పరిపోతుందని, దాన్ని చంపాలని, దాడి చేయాలని చూస్తే మాత్రం మీదకు వస్తుందని హెచ్చరిస్తుందని చెబుతున్నారు.