కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ జయించింది.ఈ మేరకు ఆ దేశం ప్రకటించింది. కనీసం తాత్కాలికంగానైనా న్యూజిలాండ్ కొవిడ్-19 మహమ్మారిని అరికట్టగలగడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఆనందం వ్యక్తం చేశారు. చిట్టచివరి కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు వైద్య అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ జీరో అయింది.
గత పదిహేడు రోజులుగా 40,000 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా, 50 లక్షల జనాభాగలిగిన న్యూజిలాండ్లో మొత్తం 3లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి చివరినుంచి చూస్తే సోమవారం న్యూజిలాండ్లో ఒక్క యాక్టివ్ కేసుకూడా లేదని ప్రధాని ప్రకటించారు. దేశంలో 1,500 మందికి కరోనా సోకగా, అందులో 22 మంది మరణించారు.