ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల భార్య చనిపోవడంతో భర్త కూడా పురుగుల మందు తాగి మృతి చెందాడు. కృష్ణా జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ... వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (24), నవాబుపేటకు చెందిన శ్రావణి (21) ప్రేమించుకున్నారు. 
 
2019 అక్టోబర్ నెలలో వీరి వివాహం జరిగింది. వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 10న శ్రావణి పుట్టింటికి వెళ్లి వస్తానని భర్తను కోరింది. భర్త అందుకు నిరాకరించడంతో శ్రావణి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త వెంకటేశ్వరరావు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. విషయం తెలిసిన వెంకటేశ్వరరావు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. శ్రావణి నిన్న ఉదయం మృతి చెందగా వెంకటేశ్వరరావు నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: