ఏపీలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల విడుదల చేసింది. గతంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచిన డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు.
గత ఎన్నికల్లో ఆయన ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి హోం మంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఇక ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికకు ఈ నెల 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 6న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉంది
ఈ నెల 26న నామినేషన్లను పరిశీలన, 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. అయితే శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుంది. జులై 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.