దేశంలో రోజురోజుకు మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని మోసగించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి చేసిన మోసాల గురించి తెలిసి అవాక్కవ్వడం పోలీసుల వంతయింది. పీయూసీ వరకు చదివిన బెంగళూరులో నివాసం ఉంటున్న జో అబ్రహాం మాథ్యూస్ అనే కేరళవాసి లండన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా, ఆర్ధికంగా దోచుకోవడంతో పాటు పలువురిని లక్షలాది రూపాయల మేర చీటింగ్ చేశాడు.
పోలీసుల విచారణలో ఈ వ్యక్తి బెంగళూరులో తొమ్మిదేళ్ల పాటు ఒక మహిళతో సహజీవనం చేసి చేసి రూ.45 లక్షలు సొమ్ము కాజేసినట్లు తేలింది. అంతకు ముందే ఓ టీచర్ కు మాయమాటలు చెప్పి కాజేశాడు. ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్లో 39 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఇతని మోసాల బాగోతం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టిన ప్రొఫైల్ను చూసి పరిచయం పెంచుకుని ఇతను మోసాలకు పాల్పడుతున్నాడు.
అనంతరం వ్యక్తిగత సమస్యలు చెప్పి విడతల వారీగా లక్షల రూపాయలు దండుకుంటాడు. ఎవరైనా పెళ్లి చేసుకోమని .... డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నగ్న ఫోటోలను బయటపెడతానని బెదిరించాడు. దర్యాప్తులో ఇతను చేసిన మరిన్ని మోసాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.