ఏపీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద హైడ్రామాకు తెరలేపాలని చూసినా అది పెద్దగా రక్తికట్టలేదు. వీళ్లంతా అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ అరెస్టుకు నిరసనగా నల్ల చొక్కాలు వేసుకుని మరీ అసెంబ్లీ ముందు ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నానా హంగామా చేసేందుకు ప్రయత్నించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే టీడీపీ నుంచి బహిష్కుతులు అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇద్దరూ కూడా టీడీపీ సభ్యులు కూర్చునే సీట్లలోనే కూర్చున్నారు. ఓ వైపు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తుంటే వీరిద్దరు మాత్రం తమ సీట్లలోనే కూర్చున్నారే తప్పా లేవలేదు. ఇక మండలిలోనూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ. ప్రభాకర్ సైతం టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నా తన సీట్లో నుంచి మాత్రం లేవలేదు. ఇలా బాబోరికి అటు ఆ పార్టీకి దూరమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరూ షాక్ ఇచ్చారు.