కరోనా మహహ్మారి గత కొంత కాలంగా తెలంగాణపై విరుచుకు పడుతుంది.  లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో విపరీతంగా పెరిగిపోతున్నాయి.  తాజాగా తెలంగాణలో నిన్న కొత్తగా మరో 213 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటిలో 165 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, జనగామ, కామారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్, పెద్దపల్లిలలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. కరీంనగర్‌లో 6, మెదక్‌లో 13, మేడ్చల్‌లో 3, నిజామాబాద్‌లో 2, రంగారెడ్డిలో 16, సంగారెడ్డిలో 2 కేసులు నమోదయ్యాయి. 

 

ఎప్పుడైతే లాక్ డౌన్ లో సడలింపు చర్యలు తీసుకున్నారో అప్పటి నుంచి దాదాపు పదహారు రోజుల  వ్యవధిలో 2,680 మంది కరోనా బారినపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో 100కుపైగానే కేసులు నమోదవుతుండడం గమనార్హం. గత నాలుగు రోజులుగా అయితే ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 200 దాటుతోంది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,406కు పెరిగింది.

 

కరోనా మహమ్మారికి నిన్న నలుగురు బలయ్యారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం మరణాల సంఖ్య 191కి పెరిగింది. తాజాగా 261 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,027కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 2,188 మంది చికిత్స పొందుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: