ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వైసీపీ నుంచి అయోధ్య రామిరెడ్డితో పాటు పరిమళ్ నత్వాని, ఇద్దరు మంత్రులు మోపిదేవి, పిల్లి బోస్ పోటీలో ఉన్నారు. టీడీపీ గెలవదని తెలిసి కూడా వర్ల రామయ్యను పోటీలో ఉంచింది. ఇక శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి.
అదే పోలింగ్లో పాల్గొన్న వారి సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం నిజానికి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలి. బలం చాలనప్పుడు ఏకగ్రీవాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. టీడీపీకి అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా, గెలిచే అవకాశం లేకున్నా కావాలనే పోటీకి దిగినట్లు స్పష్టమవుతోంది. ఇక టీడీపీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారన్న గ్యారెంటీ లేదు.