ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కు వయస్సుతో సంబంధం లేదని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు, 60 ఏళ్లు పై బడిన వృద్ధులకే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 40 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారిలో కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల ఈ వయస్సు వారంతా జాగ్రత్తగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
అదేవిధంగా మరణాల రేటు కూడా 40 ఏళ్లు పై బడిన వారిలోనే అధికంగా ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 40- 60 ఏళ్లు మధ్య వయసు ఉన్నవారు సుమారుగా 36 మంది మరణించడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్రంలోని 40 ఏళ్లు వయసు పైబడిన వారికి కీలక సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధిత దీర్ధకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 104తో పాటుగా, వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ 14410 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.