కరోనా దెబ్బకు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. చివరకు పెళ్లిళ్లు, ఫంక్షన్లు కూడా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వంట మాస్టర్కు కరోనా సోకడంతో చివరకు పెళ్లి వాళ్లంతా క్వారంటైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని హెరూరి లో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది.
అప్పటికే లాక్ డౌన్ ఉండటంతో ఇంటివద్దనే పెళ్లి నిరాడంబరం గా నిర్వహించారు. పెళ్లికి బంధువులను కూడా ఆహ్వానించలేదు. అయితే ఈ పెళ్లికి వంట చేయడానికి వచ్చిన వంట మాస్టర్కు కరోనా పాజిటివ్ సోకింది. పరీక్షల్లో సదరు మాస్టర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు అధికారులు ఈ పెళ్లి వారందరిని క్వారంటైన్కు తరలించారు. పెళ్లి వారి వివరాలు తీసుకుని నూతన వధూవరులతో పాటు సుమారు 56 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఆ గ్రామాన్ని రెడ్ జోన్ చేసి, శానిటైజేషన్ చేశారు.