కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా బస్సు సర్వీసులు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తివేయడంతో బస్సులు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో బస్సులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నాయి. అయితే వివిధ నగరాల్లో ఇంటర్నల్గా సిటీ బస్సు సర్వీసులు అయితే ప్రస్తుతం నడవట్లేదు. వీటికి అనుమతి ఇస్తే కరోనా మరింతగా వ్యాప్తి చెందుతుందన్న భయంతోనే ప్రభుత్వాలు వీటికి ఇంకా అనుమతి ఇవ్వలేదు.
ఇక రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడవాలంటే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుకోవాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటకీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం బస్సులు నడవడం లేదు. ఇటీవలే రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపినా తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తుండడంతో మళ్లీ ఈ చర్చలు ఆగిపోయాయి.
ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం విజయవాడ, విశాఖ జనాలకు గుడ్ న్యూస్ చెప్పేసింది. త్వరలోనే ఈ రెండు నగరాల్లో సిటీ బస్సులను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నది ప్రభుత్వం. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించడంతో పాటు కరోనా నేపథ్యంలో కొన్ని నిబంధనలు రూపొందించి వాటికి అనుగుణంగా బస్సులు నడపనున్నారు.