ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే విజయనగరం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను కలిపి మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. మరో వైపు విశాఖ మన్యంతో పాటు ఏపీలో కలిసిన పాత ఖమ్మం జిల్లాలోని మండలాలు కలిపి మరో జిల్లా ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు ఉద్యమం ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని అక్కడ డిమాండ్లు ప్రారంభ మయ్యాయి. ఈ క్రమంలోనే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు అఖిలపక్షం ఏర్పాటు అయ్యింది. వీరు వెనకపడిన హిందూపురం పార్లమెంటు ప్రాంతాన్ని జిల్లాగా చేస్తే అందుకు పుట్టపర్తి మాత్రమే అనువైన కేంద్రంగా ఉంటుందని.. అందుకే పుట్టపర్తి జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.