కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు స్వైరవిహారం చేస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం కొత్త కరోనా లక్షణాల లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని తెలిపింది. ఇందులో జ్వరం, వణుకు , దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం, గొంతునొప్పి, ముక్కు కారడం , వికారం లేదా వాంతులు, డయేరియా ఉన్నాయి.
ఇక ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఎలాంటి సమయంలో వైద్య సాయం కోరాలి ? అన్నది పరిశీలిస్తే పైన కనబరిచిన లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరు ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. అదే సమయంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నపుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నపుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి. లేదా 104 నంబర్ కు కాల్ చేయాలి.