సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. కార్ప్​ కమాండర్​ స్థాయి అధికారుల మధ్య మంగళవారం 10 గంటల పాటు ఏకధాటిగా సాగిన భేటీలో.. లద్దాఖ్​లోని పలు ప్రాంతాల్లో బలగాలను వెనక్కి తీసుకునే మార్గదర్శకాలకు తుది రూపు ఇవ్వడంపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఆందోళనను చైనా ముందుంచిన భారత్.. తూర్పు లద్దాఖ్​లో చైనా కొత్తగా తమవిగా పేర్కొంటున్న ప్రాంతాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

తూర్పు లద్దాఖ్​లో యథాతథ స్ధితిని పునరుద్ధరించాలని, గల్వాన్​ లోయ సహా సరిహద్దుల వెంట తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. సరిహద్దు అంశాల నిర్వహణపై గతంలో కుదిరిన ఒప్పందాలను చైనా గట్టిగా పాటించాలని సూచించింది.

 

 

వాస్తవాధీన రేఖ వద్ద భారత్​ వైపు ఉన్న చుషుల్ సెక్టార్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. భారత్​ తరఫున 14వ కార్ప్​ కమాండర్​ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్​, చైనా తరఫున టిబెట్ సైనిక జిల్లా మేజర్ లీ లిన్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: