కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతో మంది ప్రజల జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎలాంటి చీకూ చింతా లేకుండా బతుకుతోన్న వారు అందరూ రోడ్ల మీదకు వచ్చేశారు. ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలిపోవడం... ఫ్యాక్టరీలు మూతపడడంతో దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగంలో కూరుకుపోయారు. కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్ డౌన్ వల్ల లక్షలాది ఫ్యాక్టరీలు దేశ వ్యాప్తంగా మూత పడడంతో కోట్లాది మంది నిరుద్యోగులు అయ్యారు. వీరిలో చాలా మందికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి.
ఈ లాక్డౌన్ తో దేశంలో 11.40 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని, వారిలో 91.10 లక్షల మంది దినసరి కూలీలు కాగా, కంపెనీల లేఆఫ్ల వల్ల 1.70 కోట్ల మంది నెలవారి వేతన జీవులు రోడ్డున పడ్డారని ఆర్థిక నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,71,000 ఫ్యాక్టరీలు నిలిచి పోయాయని, ఆరున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని వారు తెలియజేశారు. ఫ్యాక్టరీల మూత కారణంగా 11.40 కోట్ల మంది భారతీయులు ఉపాధి కోల్పోయారని వీరు చెపుతున్నారు.