దేశంలో కరోనా వైరస్ ప్రవేశించి ఆరునెలలయ్యింది. ఈ ఆరు నెలల కన్నా జూన్ నెలలోనే దీని ప్రభావం ఎక్కువుగా ఉంది. మే నెల చివరి వరకు ఉన్న కేసులను చూస్తే కరోనా పాజిటివ్ కేసులు 1,82,143 కాగా, 5,164 మంది మృతిచెందారు. ప్రస్తుతం రోగుల సంఖ్య 5, 85,493కు చేరుకుంది. 17,400 మంది మృతిచెందారు. అంటే ఒక్క జూన్ నెలలోనే 3.5 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పడు కరోనా విజృంభిస్తోన్న తీరును బట్టి చూస్తే జూలైలో ఐదు నుంచి ఆరు లక్షల కొత్త కేసులు నమోదు కానున్నాయని కేరళకు చెందిన సీనియర్ డేటా నిపుణులు జేమ్స్ విల్సన్ అభిప్రాయపడ్డారు.
జూలైలో, జూన్కు మించి అధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు కావచ్చన్నారు. ఇక నిపుణుల అంచనా ప్రకారం మన దేశంలో జూలై, ఆగస్టు నెలల్లో కరోనా పీక్ స్టేజ్కు వెళ్లిపోతుందని.. వర్షాకాలం కూడా తోడు కావడంతో ఇతర వ్యాధులు కూడా కలిస్తే కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం సైతం తీవ్ర ఆందోళనతో ఉంది. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో ఆరోగ్య సేవలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా తర్వాత మనదేశం కూడా మరో అమెరికా, ఇటలీ మాదిరిగా మారే ప్రమాదం ఉంది.