ప్రపంచంలో కరోనా అంటే ఇప్పుడు చిన్న నుంచి పెద్ద.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఉలిక్కి పడుతున్నారు. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. దీని ప్రభావంతో కోటి కి పైగా కేసులు నమోదు అయ్యాయి.. 5 లక్షల వరకు మరణించారు. అసలే కరోనాతో చచ్చిపోతున్నాం రా బాబోయ్ అంటే.. ఇదే చైనాలో మరో దిక్కుమాలిన వైరస్ పుట్టుకు వచ్చింది. ఈ వైరస్కు జీ4-ఈఏ హెచ్1ఎన్1గా నామకరణ చేశారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగానే.. ఫ్లూ వైరస్ పంజా విసిరేందుకు సిద్ధం అవుతోంది. రాబోయే కాలంలో ఇది మహమ్మారిగా మారే ప్రమాదం లేకపోలేదని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ప్రచురితమైంది. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్1 ఎన్1 వైరస్ జాతి నుంచే ఇది ఉద్భవించినట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా, చైనా పరిశోధకులు కొత్తగా గుర్తించిన మరో ప్రమాదకర 'జీ-4' వైరస్కు సంబంధించి ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఈ అధ్యయనం శాంపిల్ చాలా చిన్నదని.. ఇంత తొందరగా దీన్ని ప్రమాదకారిగా గుర్తించలేమని తెలిపింది. అయితే ఈ వైరస్పై పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించింది చైనా విదేశాంగ శాఖ.