రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఊహకందని రీతిలో విజృంభిస్తోంది. గురువారం రికార్డుస్థాయిలో 1,213 కేసులు నమోదయ్యాయి. వైరస్తో పోరాడుతు ఎనిమిది మంది కన్నుమూశారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం వచ్చినవాటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 998 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్న వైరస్ భూతం.... తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్లో 54, రంగారెడ్డిలో48 కేసులు రావడం మహమ్మారి విజృంభణకు అద్దంపడుతోంది.
రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 5,356 పరీక్షల్లోనే... 1,213 కేసులు నమోదు కావడం వైరస్ విలయానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం ఇప్పటివరకూ 98,153 టెస్టులు నిర్వహించారు. గురువారం 987 మంది డిశ్చార్చికాగా... రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,069కి చేరుకుంది. మహమ్మారికి మరో 8 మంది బలికాగా... మొత్తం మృతుల సంఖ్య 275కి చేరినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.