ఏపీలో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లిన సంగతి తెలిసిందే. మండలి నుంచి కేబినెట్లో మంత్రులుగా నిన్నటి వరకు ఉన్న మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్చంద్రబోస్లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ కేబినెట్లో రెండు మంత్రి పదవులతో పాటు రెండు ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్లో చోటు కోసం ఆశావాహులు ఎక్కువగానే ఉన్నా ప్రస్తుతానికి అయితే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
ఈ క్రమంలోనే కొత్త మంత్రులను తీసుకునేందుకు జగన్ ముహూర్తం కూడా పెట్టేశారు. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పుకున్న ఇద్దరు మంత్రులు బీసీ వర్గాలకు చెందిన వారే కావడంతో జగన్ రెండు పదవులు ఈ వర్గానికి చెందిన వారితోనే భర్తీ చేస్తారా ? లేదా ? లేదా ఒకటి బీసీలకు, మరొకటి వేరే వర్గాలకు ఇస్తారా ? అన్న దానిపై కూడా పార్టీ వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి.