దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రెండూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తెలంగాణలోని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కరోనా సోకిన నాలుగో ఎమ్మెల్యే సునీత.
ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్యులు కూడా దృవీకరించారు. గత వారం రోజులుగా ఛటర్జీ స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆమె తెలిపింది. ఆమె గత నెల 19వ తేదీన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. కరోనా పరీక్షలు చేయడంతో ఆమెకు కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.