వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు దాదాపు బయటకు వచ్చేసినట్టే. ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ ఎంపీలు నిన్న ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసి రావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. ఇక రఘు కూడా జగన్ విషయంలో దూకుడుగానే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ఆయన చర్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి. ఈ రోజు మీడియాతో మాట్లాడిన రఘు రామ కృష్ణంరాజు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేయడంతో పాటు వికేంద్రీకరణ చేయాలనుకుంటే అమరావతిని పరిపాలనా రాజధాని చేయాలన్నారు.
అలాగే తన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా జగన్పై ప్రయోగించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు జగన్కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది. జగన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనిపై హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి రఘు డిమాండ్ను జగన్ ఎంత వరకు పట్టించుకుంటారో ? చూడాలి.